విశాలాంధ్ర పత్రికలో – 2012లో కథలపై సమీక్ష

విశాలాంధ్ర పత్రికలో – 2012లో కథలపై
నండూరి రాజగోపాల్ సమీక్ష

పిల్లలని నిద్రపుచ్చడానికో – పెద్దల కాలక్షేపానికో, సమాజ హితానికో, మనిషికి నీతి నేర్పడానికో పుట్టిన కథ కాలంతోపాటే పెరుగుతూ, తన పరిధిని ప్రపంచమంత విశా లం చేసుకుంది. కాలమంత విస్తారమయింది. మనిషితోపాటే నడుస్తూ… తను నడిచిన సమాజాన్ని గమనిస్తూ.. ఆ గమ నికలోని పరిణామాలని భద్రపరుస్తూ… ‘నేటి’ గురించి మాట్లాడటానికి, రేపటిని అంచనా వేయడానికి తెలుగుకథ ఒక చారిత్రక అవసరంగా మారిన సందర్భం ఇది. ఎప్పటికప్పుడు కాలాన్ని, సమాజాన్ని, మనిషిని, మనుగడని అంచనా వేయడానికి ఇవాళ ‘కథ’ మనకి గొప్ప వనరు. మన గురించి, మన ప్రయాణం, దానిలోని నిజాయతీ, చేరబోయే గమ్యం గురించి సూటిగా, నిష్పక్షపాతంగా, నిర్మొహమాటంగా, నిరహంకారంగా, నిర్లిప్తంగా… చెబుతున్న ‘కథ’ ఇప్పుడు జాతి అవసరం. ఇంతటి బలాన్ని తనలో ఇముడ్చుకున్న ‘కథ’ ద్వారా 2012లో మన నడకని, నడతని అంచనా వేయడానికి చేస్తున్న చిరుప్రయత్నమిది.

ఈ ఏడాది కొన్ని వందల కథలు వచ్చాయి. కొన్ని మామూలువీ, కొన్ని గొప్పవీ, ఇంకొన్ని ఇంకా గొప్పవి ఉన్నాయి. ఒక వస్తువు మీద వచ్చిన, వస్తువైరుధ్యాన్ని చూపెట్టిన కథలు ఉన్నాయి. నిర్మాణాత్మకమైన సొగసు, శైలీ విన్యాసం విలక్షణంగా జత కూడిన కథలూ ఉన్నాయి. కుల, మత, జెండర్‌, ప్రాంతీయ అస్తిత్వాలను దాటి, 2012 ‘కథ’ మనిషి జీవితంలోకి చొచ్చుకు వెళ్ళింది. ప్రాంతం, కులం, మతం వంటి విషయాలకన్నా…. మనిషి జీవించడమనే ప్రధాన విషయంపైనే దృష్టి పెట్టింది. ‘మనిషి’ చుట్టూ అల్లుకున్న సంబంధాలు, బాధ్యతలు కాపాడుకోలేకపోతే జరిగే విచ్ఛిన్నతను గురించి హెచ్చరించాయి. ఎక్కడివాడైనా ‘మనిషే’ లేకపోతే ఎదురయ్యే ‘శూన్యం’ పట్ల భయాన్ని వ్యక్తం చేశాయి. 2012 కథలను నాలుగు రకాలుగా మనం వర్గీకరించవచ్చు.

చాలామంది కథకులు బాల్యాన్ని కాపాడుకోవలసిన అవసరాన్ని గురించి ఎక్కువగా చెప్పారు. చదువులు, పోటీ, కెరీర్‌, ప్రెస్టీజ్‌వల్ల పిల్లలనుండి మనం లాగేసుకుని, పారేస్తున్న ‘బాల్యం’ వాళ్ళకి తిరిగి అందించడానికి చాలా కథలు ప్రయత్నించాయి. ఈ కథలు చదువుతున్నప్పుడు మన చుట్టూ పెరుగుతున్న బేబీ కేర్‌ సెంటర్‌లు, నర్సరీ స్కూళ్ళు, ఈ టెక్నోలు, ఐఐటి కోచింగ్‌లు కళ్ళముందు కదిలి… మన పిల్లల పట్ల భయాన్ని పెంచుతాయి. ‘స్పెల్‌ బీ’ లో జాతీయస్థాయి ప్రథమ స్థానాన్ని సాధించిన సిద్ధూ అనే కుర్రవాడు (గలుబె, సాయి బ్రహ్మానందం గొర్తి) ఆ విజయానికి పొంగిపోకుండా… బాధపడతాడు, ఏడుస్తాడు. ‘తను కోల్పోయిన బాల్యం’ గురించి చింత పడతాడు. ఆ బాల్యానికి ప్రతీకగా నిలిచిన ‘ఎరిక్‌’ అనే నల్లజాతి స్నేహితుడు కోసం ఎదురు చూస్తాడు. అతని వల్లే తనకి తెలిసిన ‘గలుబె’ అన్న పదం తనకి విజయాన్ని తెచ్చిపెట్టిందన్న సంగతి గుర్తిస్తాడు. దక్కిన విజయం కన్నా, దక్కించుకున్న బాల్య స్నేహానికి, బాల్యానికి కదిలిపోతాడు. బాల్యాన్ని, పసిపిల్లల మనసులని తల్లిదండ్రులు తమ ఆశలు, ఆశయాల కోసం చంపేస్తున్న సందర్భం ఒక పక్క, మన చుట్టూ పిల్లలని సమిధలని చేస్తూ నిర్వహిస్తున్న రియాల్టిషోలు మరో పక్క బాల్యాన్ని కాపాడుకోవలసిన అవసరాన్ని గుర్తుచేస్తాయి. ఈ కథ ఫిబ్రవరిలో వచ్చింది. తరువాత సెప్టెంబర్‌లో ‘అరచేతిలో చందమామ’ ద్వారా కొవ్వలి రామకృష్ణ పరమహంస.. పిల్లల వల్ల మనకి దగ్గరవుతున్న చందమామని, వెన్నెలని గురించి చెబుతాడు. పిల్లలతో గడవడం వాళ్ళలో పెరిగే సృజనశక్తిని కాపాడడమే అన్న సత్యాన్ని చెప్పే కథ ఇది. ‘నింగిలో చందమామ ఉన్నంత కాలం మనమంతా సెంటి మెంటల్‌ ఫూల్సేరా..’ అంటున్న ఈ కథ.. బాల్యాన్ని అనుభవించడం, ఆనందించడంలో సహచరించడంలోని మాధుర్యాన్ని గురించి చెబుతోంది. స్వాతి శ్రీపాద ‘లేని ఆకాశానికి నిచ్చెన’, సురేంధ్రనాధ్‌ ‘ఐస్‌క్రీం’, జి.లక్ష్మి ‘ఆనంద అపార్ట్‌మెంట్స్‌’ లాంటి మరికొన్ని కథలు ఈ కోవలోవే.

చాలా కథలు మానవసంబంధాలలో పెరుగుతున్న ఖాళీని గుర్తించడమే కాదు, పూరించే ప్రయత్నం చేశాయి. ఇది రెండో దశ. మనిషి జీవితంలో పెరిగిన వేగం తాలూకు ‘అనీజీనెస్‌’ కొన్ని సౌకర్యాల్ని పెంచినా, శాంతిని – సుఖాన్ని చంపేసిన దారుణ సత్యాన్ని తెలిపే కథలు. ‘నాకు కొంచెం వెసలుబాటు, కొంచెం ఊపిరి పీల్చుకోగల విరామం కావాలి. నా మీద నాకు నమ్మకం, ధైర్యం కావాలి’ అంటున్న ఈ తరహా ప్రతినిధుల బతుకులలోని సంఘర్షణతో జి.లక్ష్మి ‘పూలు పూయని నేల’ ద్వారా పాఠకుల మనసును కదిలిస్తారు. అమ్మమ్మకి ఒక మనవరాలు రాసిన ఉత్తరమే ఈ కథ. ‘నన్ను పెంచడానికి నువ్వున్నావు. నా పిల్లలని పెంచడానికి ఎవరుంటారు. అమ్మ కూడా బిజీనే కదా’ అంటున్న ఈ కాలపు అమ్మాయి పెళ్ళి చేసుకోవడం కూడా ఒక అసౌకర్యంగానూ, బరువుగానూ భావిస్తున్న లేదా అలా భావించేలా చేస్తున్న ఈ కాలపు ఉద్యోగాల నల్లటి రేఖలను ఈ కథ చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. లక్షలలో జీతాలు వస్తూ లైఫ్‌ కంఫర్ట్‌గా ఉన్నా, భద్రతగా శాంతి లేదనే నిజాన్ని చెప్పిన కథ. ఇదే రచయిత్రి ‘అమ్మ’ అని ఇంకో కథ రాశారు. అమ్మాయిలు కెరీర్‌ కోసం కుటుంబాన్ని, పిల్లలని వదిలేసుకుంటున్నారని, అబార్షన్‌లు చేయించుకుని పిల్లలని వద్దనుకుంటున్నారని, ఇలా అనుకోవడం వాళ్ళ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడంగా భావిస్తున్నారని చెప్పిన కథ ఇది. రచయిత్రి కూడా ఈ కథలో సుజాతను సపోర్ట్టు చేస్తుంది. ఏ మానవ సంబంధాల బలహీనతలనైతే ‘పూలు పూయని నేల’ ద్వారానూ, ‘సంతోషం అంటే ఏమిటి’ ద్వారాను ‘ఆనంద్‌ అపార్ట్‌మెంట్‌’ ద్వారాను చెప్పిన ఈమె ఎందుకు మళ్ళీ పిల్లలని కెరీర్‌ ప్రతిబంధకాలుగా చూపెట్టే కథ రాశారో అర్థం కాదు. ఈ నాలుగయిదు కథలు ఈ సంవత్సరంలోనే రావడం గమనార్హం.

ప్రతి కథారచయితకు ఒక దృక్పథం అవసరం. అ దృక్పథం సాధారణంగా కథ పుట్టే కాలం నాటి సమాజ అవసరానికి అమరినట్టుంటుంది. ఒకే కాలంలో రెండు దృక్పథాలుగా కథకుడు విడిపోయాడంటే దానికి ఒక పెద్ద మలుపు (్‌బతీఅఱఅస్త్ర) కాని, మార్పు కాని ఉండాలి. అటువంటిది ఏమీ లేకుండానే ఒక రచయిత అన్ని కథలలోనూ ఒకలాగా ఒక కథలో మరోలా కనపడడం పాఠకుడికి ఆ రచయిత కమిట్‌మెంట్‌ పట్ల సందేహం కలుగుతుంది. కె. రాధా హిమబిందు ‘రక్త సంబంధం’, రవీంద్రబాబు ‘పరుగు’, తటపర్తి నాగేశ్వరి ‘మమతల తీరం చివర’ లాంటి మరోకొన్ని కథలు మానవ సంబంధాల పలచనను చెప్పే కథలు.

మూడోది, అతి ముఖ్యమైనది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి జీవితాలలోని aషషఱసవఅ్‌aశ్రీఱరఎని, అది తెచ్చే విషాదాలని చెప్పే కథలు. ఈ విషాదాలు పోలీస్‌ల వల్ల అంటే వ్యవస్థ వల్ల కావచ్చు, కులం వల్ల కావచ్చు, వృత్తుల వల్ల కావచ్చు, భక్తి వల్ల కావచ్చు, మూఢాచారాల వల్ల కావచ్చు, కుటుంబ హింస వల్ల కావచ్చు. ఏమైనా వాటి విస్తృతి చాలా ఎక్కువవుతున్న కాలంలో ఖీతీaఅస శీః షశీఅఅవతీ చెప్పిన ఈ ఃరబbఎవతీస్త్రవస జూశీజూబశ్రీa్‌ఱశీఅ స్త్రతీశీబజూః వ్యథలను రికార్డు చేసిన కథలే ఈ సంవత్సరపు సమాజాన్ని నిలువెత్తుగా తర్వాతి తరానికి అందించబోయే వనరులు. ”ఎన్ని యుద్ధాలు కలిస్తే ఒక జీవితం! ఆధ్యాత్మికత గొప్ప శాంతి కావచ్చు. గొప్ప యుద్ధమూ కావచ్చు. కాని జీవితం మాత్రం అనేక యుద్ధాల గందర గోళమే’ అంటున్న అఫ్సర్‌ ‘ముస్తాఫా మరణం’ బతుకికి – భక్తికి, ఆధ్యాత్మికతకి – ఆడంబరానికి, పూజకి – ప్రచారానికి మధ్య వ్యత్యాసాన్ని, ఘర్షణని చూపెట్టిన కథ. ఇది 2012 జనవరి 29న వచ్చిన కథ. సమాజంలో మనతోపాటే పుట్టి, మనతో పాటే పెరిగిన వాళ్ళు హఠాత్తుగా ‘బాబా’లై పోవడం ‘అమ్మ’లై పోవడం, వారి వెనుక హడావుడి ప్రారంభమవడం లాంటి కథలు మనకు తెలుసు. అయితే, అలా పెరిగిన ‘బాబాల’ కుటుంబ సభ్యుల మానసిక క్షోభకి ఈ కథ గొప్ప ఉదాహరణ. ఇస్లాం చదువుకున్నవాడు, భక్తి అంటే ఏమిటో నిజంగా అర్థమయినవాడు అయిన ముస్తాఫా ఎందుకు ఇరుకు గదికి మారిపోయాడో, ఆకాశం – నేల కనపడని అంధుడయి పోయాడో, ఇబాకత్‌(భక్తి) అంటే కుటుంబాన్ని దిక్కులేకుండా చెయ్యడం కాదని ఎందుకు తెలుసుకోలేకపోయాడో… కథంతా పాఠకుడిని వెంటాడుతూనే ఉంటుంది. డబ్బు పట్ల కూడా ఆశలేకుండా, జ్ఞానమో, విపరీత జ్ఞానమో తెలీని ముస్తాఫా ఆధునిక సమాజానికి ప్రతిరూపం. ఒక సింబల్‌. సమాజం కూడా అంతే. పెరుగుతోందో, విరుగుతోందో తెలియని స్థితి. ఆకాశానికి, భూమికి మధ్య త్రిశంకుగా వేళ్ళాడుతున్న దుస్థితి. వెతికి చూస్తే శూన్యం తప్ప ఏమీ కనపడని పరిస్థితి. ఇంతటి అనిశ్చితి మధ్య జీవితం అంటే అనేక యుద్ధాల వేదికని, కాలమే దానికి ఓదార్పు అని చెప్పే గొప్ప తాత్వికత ఇముడ్చుకున్న కథ.

ఈ మూడో దశలో సామాన్య రాసిన కథ ‘ఆలం కాందోకార్‌’ గొప్ప కథ. ఆగస్టులో వచ్చిన ఈ కథ పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌గా పనిచేసి, విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధపడిన ‘అలం’ను విశ్రాంతి తీసుకోనివ్వకుండా కట్టడి చేసి, ఒప్పుకోకపోతే అతని కొడుకుని ఇన్‌ఫార్మర్‌గా తయారుచేయమని ఒత్తిడి చేసి, అదీ కుదరకపోతే అతనిపై డెకాయిట్‌ కేసు పెట్టిన పోలీస్‌ వ్యవస్థవల్ల అలం పడ్డ వేదన, అవమానం వ్యవస్థను ప్రశ్నిస్తూనే ఉంటుంది. చివరికి తన బతుకుకు చావుని ముగింపు చేసిన అలం ఓడిపోయిన మానవత్వానికి పరాకాష్ఠ. పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ల జీవితాలు ఎంత ప్రమాదంలో ఉండి పోతున్నాయో, ఎలాంటి హింస ఎదుర్కొంటున్నాయో ఈ కథ చదివితే అర్థం అవుతుంది. బతకడం కోసం ఒక మార్గాన్ని వెతుక్కునే క్రమంలో అనుకోకుండా ఇన్‌ఫార్మర్‌గా మారడం, ఎంతోమంది డెకాయిట్‌లను మార్చడం, తన ఊళ్ళోవాళ్ళకి సహాయం చేయడంలాంటి మంచిపనుల ‘అలాం’ ను ఎవ్వరూ రక్షించలేకపోవడం ఒక ఎత్తైతే, ప్రభుత్వ యంత్రాంగంలోని పెద్దలలో అలముకున్న ఉదాసీనత మరొక ఎత్తు. అన్ని సమస్యల్లాగానే ఈ సమస్యను రొటీన్‌ లోంచి చూడడం వల్ల, ‘అలాం’ వ్యక్తిత్వాన్ని గుర్తించకపోవడం వలనే మోసానికి, దుర్మార్గానికి శిక్షపడటం చాలా ఆలస్యమవుతోంది. ఒక్కొక్కసారి జరగడము లేదు కూడా. ఈ రెండింటిని చాలా గొప్పగా చెప్పిన ఈ కథ ఈ సంవత్సరంలో వచ్చిన అతి మంచికథలలో ఒకటి.

సానపెట్టే వాళ్ళని, మాట్లు వేసేవాళ్ళని, కూరలమ్మేవాళ్ళని, పాత పేపర్లని కొనేవాళ్ళని, రగ్గులమ్మే వాళ్ళని, అందరూ అనుమానంగానే చూస్తారు. ఎవరూ మామూలుగా చూడరు. ఏది పోయినా వాళ్ళనే ముందు దోషులని చేస్తారు. ఇది ఇప్పటి విషయం కాదు. ఎప్పటినుండో ఉన్నదే. ఊళ్ళల్లో ఏది జరిగినా పోలీసులు ముందు వీళ్ళనే నేరస్తులను చేస్తారు. అలాంటి వేధింపులతో తన తండ్రి నేర్పిన విద్య ‘సానపెట్టడాన్ని’ , సానపెట్టే మిషన్‌ని వదిలి దిక్కుతోచని స్థితిలో దిక్కులేకుండా వెళ్ళిపోయిన పకీరప్పని ‘తూర్పు మండపం’ కథలో వేంపల్లి గంగాధర్‌ మనకి పరిచయం చేస్తారు. ఉన్న వృత్తిని కూడా వదిలేసేంత వేధింపులకు గురిచేస్తున్న వ్యవస్థ పట్ల అహంకారం ఈనాటి కథకులలో కనపడుతుంది. అదే సమయంలో.. అందరినీ ఒక చోటకి చేరుస్తున్న ‘తూర్పు మండపం’ ఇవాల్టి అవసరంగా చూపెట్టడం ఈ కథలోని శిల్ప నైపుణ్యానికి నిదర్శనం.

మనం చేసే ఏ వృత్తిలోనైనా ఆఖరికి ‘వేశ్యావృత్తి’లోనైనా సరే ‘ఎథిక్స్‌’ పాటించడమనే సంప్రదాయాన్ని వదిలివేస్తున్న ఈనాటి సమాజానికి ‘శివపురి’ (శరత్‌చంద్ర) ఒక ప్రతీక, ఒక వృత్తి, ఒక కుటుంబ ఆచారం ఇవాళ వ్యాపార సామ్రా జ్యంగా మారి నీతిని వదిలేస్తున్న సందర్భంలో.. అందరూ కూడా ‘జీవించడం’ కోల్పోవడమే జరుగుతోందని అర్థమ వుతుంది. చావలేదు కాబట్టి బతికున్నామని అనుకోబట్టే స్పం దించడం మర్చిపోయిన జనం మధ్య బతుకుతున్నాం. టశ్రీa్‌ జీవితాలని ఆవిష్కరించిన ఈ కథలు ఎక్కువగానే వచ్చాయి.

ఇక నాల్గవ దశలో తరాల మధ్య తేడాను, సంఘర్షణను చెప్పే కథలు చోటు చేసుకున్నాయి. ఒక దశాబ్దకాలంలో సమాజంలో వచ్చిన పెద్ద మార్పు ఏమిటంటే, ఈ తరం పిల్లలు డబ్బుతోపాటు గుర్తింపునూ కోరుకోవడం. తమ తల్లి దండ్రుల ద్వారా వాళ్ళకి ఆ గుర్తింపు రావాలనుకోవడం. ఒక హౌదా కావాలనుకోవడం. చాలా చిత్రంగా డబ్బుకన్నా కూడా ఇప్పుడు ఈ కోరిక ఈ తరానికి ఎక్కువయిపోయింది. దీనిని సరిగ్గా పట్టుకున్న కథ జి.ఉమామహేశ్వర్‌ ”నీ లీల పాడెద లేలా”. సన్నాయి వాయించడం, క్షురకర్మ చేయడం వృత్తి అయిన తండ్రి నుండి ఆ వృత్తి స్వీకరించడానికి కొడుకు సిద్ధపడడు. పెళ్ళిళ్ళలో తండ్రి అద్భుతంగా వాయిస్తున్న సన్నాయిలోని మధురిమని ఆస్వాదించకుండా… ఇష్టం వచ్చినపుడు ఆపమనడం, భోజనాలకి కూడా ఆఖరుగా పిలవడం, తండ్రిలోని కళని గుర్తించకపోవడం కొడుకుకు ఆగ్రహంగా మారుతుంది. ఎలాంటి గుర్తింపు లేకపోయినా, తన వృత్తిని ప్రేమించడం, దానిని జీవితంగా స్వీకరించడం, అలా చెయ్యని కొడుకుకి సన్నాయిపట్టుకునే హక్కులేదని నిందించడం చేసిన తండ్రి నిన్నటి ప్రతినిధి. గుర్తింపు లేని సన్నాయి నుండి అందరూ గుర్తించే ‘వీడియోగ్రాఫర్‌’గా మారిన కొడుకు నేటి ప్రతినిధి. ఈ రెండు తరాల మధ్య ఉన్న తేడాని చాలా విశేషంగా చెప్పిన జి. ఉమామహేశ్వర్‌కి అభినందనలు. ఒక గుర్తింపును కోరుకోవడం, దాని కోసం పోరాడడం, సాధించడం నేటి తరం నైజంగా ఈ సంవత్సరం వచ్చిన కథల ద్వారా మనం తెలుసుకోవచ్చు.

‘మనకి ప్రమాదం జంతువు నుండి కాదయ్యా, నిన్న అలిపిరిలో దించిన కారు డ్రైవరూ, కొండమీద కిళ్ళీ కొట్టువాడూ, కొండపై పనిచేసే ఆఫీసరు, దేవుడి ముందు క్యూ కాపల కాసే ఆమెలాంటి వాళ్ళకి మనం భయపడాలి’ అంటున్న సాయి బ్రహ్మానందం గొర్తి ‘చిరుత’ కథ మనుషులలో పేరుకుపోయిన మోసాన్ని, అవినీతిని, యాంత్రికతని చెబుతుంది. పది గంటలు క్యూలో నిలబడి దేవుడిని దర్శించుకోలేని ‘వడివేలు’ లాంటి వాళ్ళ బతుకులలో… కాలం వాళ్ళకి సంపాదించడానికి, బతకడానికే సరిపోదు. ఏ పనైనా సరే. .. తినడానికి ఉపయోగపడుతుందంటే, దానికి రెడీ అయిపోయే మనుషులలోని అమాయకత్వం, దానికి దోచుకుంటున్న వ్యవస్థ దుర్మార్గం చాలా మంది కథకులని కలవరపరుస్తున్న విషయం.

కుప్పిలి పద్మ ‘మదర్‌ హుడ్‌ ఏ రియాల్టిచెక్‌’, కొల్లూరి సోమశంకర్‌ ‘ఎం.ఆర్‌.పి’, స్కైబాబా ‘ఊహ’, సన్నపురెడ్డి వెంకటరెడ్డి ‘బిలం’, నేహ ‘పట్నం బతుకులు’, ఓల్గా ‘ఆశల బరువు’… ఆ సంవత్సరం వచ్చిన మంచి కథలలో కొన్ని. ఇలాంటివే చాలా వున్నా… స్థలాభావం కొన్ని పరిమితులను సృష్టించింది. మనుషులను దగ్గరకు తీసుకోవడం కోసం, సమాజాన్ని సుస్థిరపరచడం కోసం, రేపటి తరాన్ని అందించే ‘బాల్యాన్ని’ పరిరక్షించడం కోసం ‘కథ’ తన ప్రయత్నాన్ని చేస్తూనే ఉంది. దీనికి భంగం కలిగించిన ప్రతిసారీ తెలుగు కథకుడు తన కలాన్ని ఎక్కుపెట్టి… యుద్ధం చేస్తూనే ఉన్నాడు. గత దశాబ్దకాలంలో… తెలుగు నేలపై సమస్యను సృష్టిస్తున్న మానవ సంబంధాల బలహీనత, పిల్లల పట్ల నిర్లక్ష్యం, మధ్యతరగతి జీవితాలపై హింస, తరాల మధ్య అంతరం ఈ సంవత్సరం కథలలో చోటుచేసుకున్నాయి.

కాబట్టే, ఒక పోరాటం నుండి, ఒక ఉద్యమం నుండి ఇవాళ తెలుగు కథ మనిషిని కాపాడుకోవడం ముఖ్యమనుకుంటోంది. మనిషి దగ్గరికి చేరడానికి, మనిషిని చేరడానికి ప్రయత్నిస్తోంది. కనపడకుండా పోతున్న ఆత్మీయ జాడలను వెతికి పట్టుకునే దిశగా ప్రయాణిస్తోంది. అపురూపమైన బాల్యానికి ప్రేమనద్ది కాపాడే ప్రయత్నం చేస్తోంది. సమాజంలో మనుషుల జాడను సిద్ధం చేస్తోంది.

– నండూరి రాజగోపాల్‌

Thanks to Shariff Vempalli for forwarding this link.

1 వ్యాఖ్య »

  1. బాగుంది. సంతోషం

RSS feed for comments on this post · TrackBack URI

వ్యాఖ్యానించండి