Archive for మార్చి, 2011

ప్రపంచ రంగస్థల దినోత్సవం – మార్చి 27

జాజర


“కావ్యేషు నాటకం రమ్యమ్” అన్నది భారతీయ సాహిత్యంనుండి పుట్టిన అతి రమణీయమైన వాక్యం. కావ్యాలలో నాటకానికున్న ప్రాధాన్యతనీ, ప్రాచుర్యాన్నీ చెబుతుందిది. ఈ నెల అంటే మార్చి 27న అంతర్జాతీయ రంగస్థల దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా నాటక ప్రియులు పెద్ద ఎత్తున సభలూ, సమావేశాలూ జరుపుకునే రోజు. నాటకరంగ కృషికి అందరూ పండగ జరుపుకునే రోజు.

ప్రాచీన కళల్లో నాటకానుకున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. చరిత్ర చూస్తే ఈ నాటక కళ వివిధ దేశాల్లో, ఒక దేశం ప్రేరణా, ప్రమేయం లేకుండా విడివిడిగా ఎదిగిన కళ. సుమారు నాలుగో శతాబ్దంలో “ది పెర్సియన్స్” నాటికని గ్రీకులు వేసారని చెబుతారు. ప్రపంచంలో మొట్టమొదటి నాటకాన్ని ఎథెన్స్ నగరంలో దైనోసిస్ అనే ధియేటర్లో ప్రదర్శించారని చరిత్ర చెబుతోంది. భారతదేశంలో క్రీ.పూ నాల్గవ శతాబ్దంలో భరతముని రాసిన నాట్య శాస్త్రమే నాటకానికి స్ఫూర్తి అన్న మరో వాదన కూడా వుంది. అతి ప్రాచీనమయిన కళల్లో నాటకం ఒకటి. భారతీయ రంగస్థలం రుగ్వేద కాలం నుండీ ఉందని అంటారు. మొట్ట మొదటి నాటకం అక్షరరూపం దాల్చింది మాత్రం సంస్కృత భాషలోనే. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, మాళవికాగ్నిమిత్రం, భవభూతి రచించిన మాలతీమాధవీయం, ఉత్తరరామ చరిత్ర ప్రాచీన నాటికలయినా ఇప్పటికీ అవి అపురూపమైనవి. ఆయా నాటకాలు నేటికీ ఆదరణీయమైనవే!

సుమారుగా ఒకే కాలంలో పాశ్చాత్య దేశాల్లోనూ, భారతదేశంలోనూ నాటక ప్రక్రియ మొదలయ్యింది. ఇప్పట్లో లాగ అప్పట్లో దేశాల మధ్య రాకపోకల్లేవు. అసలు దేశం ఉనికే తెలీదు. అలాంటిది ఒకే ప్రక్రియ రెండూ వేర్వేరు చోట్ల ప్రాణం పోసుకోవడానికి ముఖ్య కారణం మానవ సంబంధాలూ, సమాజమూనూ. నాటకం వీటినుండే పుట్టింది. గడిచిపోయిన దాన్ని కళ్ళముందు జరిగుతోందన్న భ్రమని కలగజేయడమే నాటకం. ఆ భ్రమకి వాస్తవ రూపం ఇచ్చేది నాటక రచన అన్నది నిర్వివాదం. నాటకం సర్వజననీయం; సర్వకాలీనం. కాలాన్ని బట్టీ, ప్రదేశాన్ని బట్టీ, సంస్కృతిని బట్టీ రూపం మారుతుంది తప్ప అంతర్లీనంగా నాటక మూల సూత్రం మాత్రం అందరికీ ఒక్కటే! అందువల్లే నాటకం బహుళాదరణ పొందిన రంగస్థల ప్రక్రియ. ప్రస్తుతమున్న నాటకం కాల క్రమేణా రూపం మార్చుకుంటా విశ్వజననీయమయ్యింది. దాని గుర్తుగానే ప్రపంచ రంగస్థల నాటక దినోత్సవం పుట్టింది.

అంతర్జాతీయంగా మార్చి 27న ప్రపంచ రంగస్థల దినంగా ప్రకటించారు. ఇది 1961లో ప్రపంచ రంగస్థల సంస్థ ద్వారా శ్రీకారం చుట్టబడింది. ఈ రోజు పురస్కరించుకొని ప్రపంచ వ్యాప్తంగా నాటక ప్రదర్శనలూ, సభలూ జరుగుతాయి. ఆ విషయాలందరూ పంచుకుంటారు. అర్వి కివిమా అనే హెలెన్‌స్కీ జాతీయుడు మొట్ట మొదటి సారిగా 1961లో వియన్నాలో ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవ ప్రతిపాదన తీసుకొచ్చాడు. వియన్నా లో ప్రపంచ రంగస్థల సంస్థ యూక కార్యక్రమానికి అనేక దేశాలనుండీ నాటకప్రియులు విచ్చేసారు. కివిమా ప్రతిపాదన నచ్చి, అందరూ అంగీకరించారు. ఆ తరువాత ఏడాది పారిస్‌లో జరిగిన రంగస్థల సమాఖ్యలో పూర్తి స్థాయిలో మొదలయ్యింది. అప్పటినుండీ అప్రతిహతంగా ఈ రంగస్థల దినోత్సవం జరుపుతూనే ఉన్నారు. ప్రతీ ఏటా ప్రపంచవ్యాపతంగా నాటక రంగానికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తిని ఆ ఏడాదికి సంచాలకుడిగా నియమిస్తారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రంపంచంలోని నాటక ప్రియులు తమ తమ అనుభవాలని పంచుకుంటారు. నాటక రంగ కృషికి కొత్తొ కొత్త ఆలోచనలు చేస్తారు. అలాగే ప్రతీ దేశం నుండీ ఒక ప్రముఖ వ్యక్తిని ఆ సంస్థ సలహాదారుగా నియమిస్తారు. భారత దేశం నుండి ప్రముఖ నాటకకర్త గిరీష్ కర్నాడ్‌ని ఈ సంస్థ నాటక ప్రతినిధిగా నియమించారు.

గతంలో రాయల్ షేక్‌స్పియర్ కంపెనీ తరపున నాటకాలు వేసిన ప్రఖ్యాత నటీమణి జేమ్ జూడె డెంచ్‌ ఈ ఏటి రంగస్థల దినోత్సవ ప్రతినిధి.

రంగస్థలం వినోద ప్రదేశమే కాదు; వివిధ సంస్కృతుల్నీ. జాతుల్నీ, మనుషుల్నీ ఒకటిగా కలిపే ప్రక్రియ. దానిక్కావలసింది రంగస్థలం, నాటకాభిమానులూ. అక్కడే మనం ఆనందిస్తాం;దుఃఖంలోకి నెట్టబడతాం; ఆలోచనలకి అంకురార్పణ చేస్తాం; స్ఫూరి చెందుతాం. ఇదీ రంగస్థల మహత్యం.” అని ప్రపంచ రంగస్థల దినోత్స్వవ సందర్భంగా జూడీ డెంచ్ అంటారు.

ప్రపంచ రంగస్థల దినోత్సవవం అంటే రంగస్థల అనుభవాలని పంచుకోడం కాదు. ఈ సందర్భంగా ప్రాంతీయ నాటక రంగ అనుభవాన్ని ప్రపంచానికి తెలియ చెప్పే రోజు. నాటక ప్రక్రియపై మక్కువతో నాటక ప్రియులందరఊ కలసి అభిమానంగా పండగ జరుపుకునే రోజుగా ఈ రంగస్థల దినోత్సవాన్ని జరుపుకోవాలి. దీన్ననుసరించి ఈ ఏడాది ( 2010 లో ) కెనడాలోని వాంకోవర్లోనూ, అమెరికాలో న్యూయార్కులోనూ,షికాగో, శాన్‌ఫ్రాన్సిస్కో వంటి ప్రముఖ నగరాల్లోనూ, మెక్సికోలోనూ, జపాన్‌లోనూ, లండన్, నార్వే, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లోనూ ఎంతో వైభవంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా వారి వారి భాషల్లో నాటకాలు ప్రదర్శిస్తారు. ప్రతీ ఏటా వివిధ దేశాల నుండీ ఒక ముఖ్య నాటకానికి బహుమతి అందజేస్తారు. ఆది ఆ నాటక ప్రదర్శనా నిమిత్తం ఇస్తారు తప్ప వ్యక్తులకీ, సంస్థలకీ కాదు.

ప్రపంచం నలుమూలలా నాటకం అభివృద్ధి చెందింది, ఒక్క తెలుగు నాట తప్ప. పూర్వపు నాటకాలకీ ఇప్పుడు ప్రదర్శించే నాటకాలకీ చాలా తేడా వుంది. రచనా పరంగా, రంగస్థల పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. నటన అన్నది స్థల,కాలాల్ని బట్టీ మారుతుంది. కేవలం వినోదం అన్న స్థాయి నుండి నాటకం ఒక అనుభవం అన్న స్థాయికి ఎదిగింది. విదేశాల్లో ఈ అనుభవాన్ని పొందడానికి ఎంతైనా ఖర్చుపెడతారు. తెరతీయగానే మనల్ని జుట్టు పట్టుకొని నాటకంలోకి లాక్కెళ్ళిపోతుంది. ఆ సన్నివేశం పైకప్పు మీదుండి వీక్షిస్తున్నామన్న అనుభూతి కలిగిస్తుంది. మనం కూడా నాటకంలో ఒక పాత్రధారులమేనన్న భ్రమ కలిగిస్తుంది. ఈ విధంగా నాటకం ఎదిగింది. సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. రంగస్థలం మీదే వర్షమూ, తుఫానూ, మంటలూ, మంచూ చూపించడమూ, మేఘాలు రప్పించడం వంటి ప్రక్రియలు చేకూర్చి రంగస్థలాన్ని మరో మెట్టుపైకి తీసుకెళ్ళింది సాంకేతిక విజ్ఞానం. మామూలుగా అమెరికా వంటి దేశాల్లో సినిమా చూడడానికి పది లేదా పదిహేను డాలర్లు ఖర్చుపెట్టే ప్రేక్షకుడు, రంగస్థల అనుభవాన్ని పొందడానికి ఏభై నుండి వంద డాలర్ల వరకూ వెచ్చిస్తారు. నాటకం వచ్చిందీ అంటే ఎగబడి మరీ చూస్తారు. బ్రాడ్‌వే షోలకీ, ధియేటర్‌కీ ఉన్న ఆదరణ ఇంతా అంతా కాదు. ఇదీ పాశ్చాత్య దేశాల్లో నాటకానికున్న విలువ.

మరాఠీ, బెంగాలీ, కన్నడ నాటకరంగాలు మినహాయిస్తే తెలుగు నాటక రంగం మాత్రం ఏమాత్రం ఎదగలేదు. ఎక్కడ వేసిన గొంగళీ అక్కడే అన్న చందంగా మిగిలింది. పరిషత్తులూ, ప్రదర్శనలూ పెరిగాయి తప్ప నాణ్యత ఏమాత్రం లేకుండా, పూర్వం వేసిన నాటకాలే మెరుగ్గా వున్నాయన్న అభిప్రాయాన్ని కలగజేస్తున్నాయి. రంగస్థలానికి కావల్సిన సౌకర్యాలు సున్నా. సరైన ధియేటర్లు లేవు. ఏదో ఒక హాలు తీసుకొని నాటకం వేయ్యాల్సిన పరిస్థితే ఇప్పుడుంది. నాటకం వేయడానికి అతి ముఖ్యమైన మైకులూ, స్పీకర్ సిస్టములూ ఉండవు. ఉన్నా సరిగా పనిచేయవు. మైకులు మొరాయించని నాటకం ఉండదూ అంటే అతిశయోక్తి కాదు. సాంకేతిక పరంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత దేశమూ ఒకటి. అయినా పరిస్థితి అరవయిల్లో నాటకాలు దాటి పోలేదు. రచనా పరంగా, నటనా పరంగా కూడా అదే పరిస్థితి. రాశి పెరిగింది కానీ వాసి లేదు. నాటక రంగం మంచి నటుల్ని తయారు చెయ్యలేకపోతోంది.

తెలుగు వారికి నటులూ అంటే సినిమా నటులే అన్న ఒక అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. సినిమాల్లో నటన ముక్కలు ముక్కలుగా చిత్రీకరించబడుతుంది. నాటకంలో ఏకబిగిన మొత్తం సన్నివేశంలో నిమగ్నమై నటించాలి. అది చాలా కష్టం. నాటకాలు వేసిన వాళ్ళు సినిమాల్లో రాణిస్తారేమో కానీ, సినిమా నటులు నాటకాల్లో రాణించడం అంత సులభం కాదు. ఏటా నంది నాటకాలు పేరు చెప్పి ఓ పది పదిహేను నాటకాలు వేయించి ప్రభుత్వమూ చేతులు దులిపేసుకుంటుంది. నాటకరంగ అభివృద్ధి బహుమతుల ద్వారా జరగదన్న చిన్నవిషయం ఎందుకు అర్థం కాదో తెలీదు. నాటక ప్రదర్శనకి అన్ని సౌకర్యాలూ, సదుపాయాలతో మంచి ధియేటరు కావాలి. కేవలం కళా ప్రదర్శనకే పరిమితమైన ధియేటర్లు మనకి లేవు. సంతాప సభకీ, సత్కార సభకీ రవీంద్ర భారతే దిక్కు. రాజధాని నగరమే ఇలా వుంటే విశాఖపట్టణం, వరంగల్లూ, విజయవాడా, తిరుపతి వంటి నగరాల గురించి చెప్పనవసరం లేదు. నాటక రంగాన్ని మరో మెట్టుకి తీసుకెళ్ళాలంటే ప్రభుత్వమే కాదు, నాటక ప్రియులూ నడుం కట్టాలి. ముఖ్యంగా ప్రదర్శనలని ఆదరించి ప్రేక్షకులూ వారివంతు చేయూత ఇవ్వాలి. ప్రపంచ రంగష్తల పటంలో తెలుగు నాటకానికీ ఒక స్థానం కల్పించాలి. ప్రపంచ రంగస్థల ఉద్దేశ్యం కూడా అదే! ఆ రోజు త్వరలోనే వస్తుందని ఆశిద్దాం. అంతవరకూ ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని తప్పనిసరిగా విధి తప్పకుండా నాటకప్రియులందరూ జరుపుకుంటారని కోరుకుందాం.

గతంలో ఈమాటలో నేను “తెరమరుగవుతున్న తెలుగు నాటకం” పేరున నాటకం పుట్టు పూర్వోత్తరాలు మొదలుకొని ప్రస్తుత నాటకం గురించీ రాసాను. మధ్యలో కొన్ని నాటకాల గురించి ప్రస్తావించలేదని కొంతమంది అన్నారు. వీలు చూసుకొని రాయాలి.

తెరమరుగవుతున్న తెలుగు నాటకం -1

తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2

తెలుగు నాటకం అనేది ప్రదర్శన స్థాయినుండి అనుభవ స్థాయికెదగాలని కోరుకుంటూ…

నాటకరంగం భుజం తట్టుదాం!

నామ మాత్రపు నంది నాటకాలు – ఆంధ్రజ్యొతి

Comments (1)

Older Posts »