సరిహద్దు సమీక్ష, సాక్షిలో
చిక్కని కథలు… చక్కని సందేశాలు
ప్రవాస జీవన కోణంలో రచయిత సాయి బ్రహ్మానందం చిత్రీకరించిన కథల సంకలనమే ‘సరిహద్దు’. అమెరికా ఓ అందమైన కల. ఆ గుమ్మంలో రెక్కలు కట్టుకొని వాలితే చాలు… డాలర్లకు డాలర్లే. అంత వరకూ బాగానే ఉన్నా ఆ బిజీ జీవితంలో పడి మూలాలను మరచిపోతున్న మనుషుల తీరును, అనురాగాలు, ఆప్యాయతలు లేని మనసులను, పాశ్చాత్తీకరణతో నిస్సారమవుతున్న జీవితాల వ్యథను తన కథల్లో ఆవిష్కరించారు.
పిల్లలను ప్రభావితంచేసే పెద్దల ప్రవర్తనను తెలియజెప్పే ‘అంటే ఏమిటి’, తండ్రీ బిడ్డల మధ్య సంబంధాన్ని యాంత్రికం చేసిన జీవితాన్ని కళ్లకు కట్టిన ‘ఒంటరి విహంగం’, ప్రవాసుల సొమ్ముతో సోకులద్దుకోవాలనుకునే ‘స్టార్’ల నైజాన్ని చెప్పే ‘అతిథి వ్యయోభవ’ కథలు వాస్తవికతను కుండబద్దలుగొట్టినట్టు చెప్పాయి.
భార్యాభర్తల సంఘర్షణను చెప్పిన ‘అబద్ధంలో నిజం’ వ్యష్టి కుటుంబాల్లోని సర్దుబాటు జీవితాన్ని తెలిపింది. అవినీతి వేళ్లూనుకుంటున్న ఈ రోజుల్లో ఒక ఆటోడ్రైవర్ ఓ ప్రవాస భారతీయుడిపట్ల చూపిన నిజాయితీని మంచి మలుపులతో ‘నూటికొక్కడు’లో ఆవిష్కరించారు.
స్వేచ్ఛ పేరిట భార్యాభర్తల బంధాన్ని సైతం తెంచుకోవాలనుకున్న కుమార్తెకు ‘స్వేచ్ఛ’లో తల్లి ఇచ్చే సర్దుబాటు సందేశం… ప్రస్తుత పోకడలకు అమరుతుంది. కుటుంబ బాధ్యతల చట్రంలో నలిగిపోయే స్త్రీ వ్యథను చెప్పే ‘ఊర్మి లేఖ’ కథ సంకలనానికే హైలైట్.
పాతిక కథలూ ఒకదానికొకటి పోటీ పడ్డాయి. కథాగమనం, పాత్రలద్వారా మనస్తత్వ విశ్లేషణ, పాత్రల ద్వారా చెప్పిన సందేశం ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
- పట్నాయకుని వెంకటేశ్వరరావు
సరిహద్దు (కథలు)
రచన:
సాయిబ్రహ్మానందం గొర్తి
పేజీలు: 198; వెల: రూ. 100
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు

